పచ్చ పంజరంలో వైఎస్ చిలుకలు సేదదీరుతున్నాయి. వైఎస్సార్ కుమార్తె మెరుసుపల్లి షర్మిల, వివేకా కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత యథేచ్ఛగా వైఎస్ కుటుంబ పేరును వాడుకుంటున్నారు. తమ అన్న వైఎస్ జగన్ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. వాళ్లిద్దరికీ పచ్చ మీడియా గొంతుకవుతోంది.
వైఎస్సార్ జీవించినన్ని రోజులు ఏ మీడియాకైతే వ్యతిరేకంగా పోరాడారో, ఇప్పుడు వారి కుమార్తెలు, అదే మీడియాకు దత్త పుత్రికలయ్యారనే ఆరోపణ ఎదుర్కొంటున్నారు. పలకించేది చంద్రబాబు, ఎల్లో మీడియాధిపతులైతే, పలికేది షర్మిల, సునీత అని వైసీపీ తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తోంది. గత రెండు రోజుల్లో తీసుకుంటే వైఎస్సార్ మాటల్లో చెప్పాలంటే తోకపత్రిక చానల్ అధిపతికి వివేకా కుమార్తె, అల్లుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. యథేచ్ఛగా జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అవాకులు చెవాకులు పేలారు.
తాజాగా ఈనాడు-ఈటీవీ ముఖాముఖిలో షర్మిల తన నోటి దురుసును యథేచ్ఛగా కొనసాగించారు. కడపలో న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న పోరాటంలో గెలిచేది తానే అంటూ బీరాలు పలికారు. జగన్ అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారని, ఆయన్ను మించిన ఊసరవెల్లి ఎవరుంటారని షర్మిల దారుణ విమర్శ చేశారు.
అలాగే తనకు అండగా నిలవలేదని కుటుంబ సభ్యులందరిపై దారుణ కామెంట్స్ చేశారు. తనను ఓడించేందుకు జగన్ సతీమణి భారతి సహా తమ కుటుంబంలోని ఆయన అధికారానికి , డబ్బులకు లోబడే వారందరినీ మూకుమ్మడిగా ప్రచారంలోకి దించారని దురుసు వ్యాఖ్యలు చేశారు.
"నన్ను గెలిపిస్తే మీ బలం అవుతా. మీ గొంతుకనవుతా. మీ కోసం కొట్లాడ్తా. ఇక్కడే జనానికి అండగా నిలబడతా. ఈ గడ్డకే జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నా".. ఈ కామెంట్స్ షర్మిల నోట ఎప్పుడో, ఎక్కడో విన్నట్టు గుర్తుకొస్తుంది. తెలంగాణలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా ఇవే మాటలు మాట్లాడారు. అక్కడ ప్రజలు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి, ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ...వైఎస్సార్ అభిమానులు జీర్ణించుకోలేని విధంగా రాజకీయం చేస్తున్నారు.
వైఎస్సార్ ఆ రెండు పత్రికలంటూ... నిత్యం ఎదురు దాడి చేసేవారు. ఇప్పుడు ఆ రెండు పత్రికలతో పాటు మరికొన్ని ఎల్లో చానళ్లు షర్మిల, సునీతకు ఇష్టమైనవయ్యాయి. వైఎస్సార్, వివేకా చనిపోయి బతికిపోయారని ...కూతుళ్ల విపరీత ధోరణులను చూసిన వారి అభిమానులు అంటున్నారు. పచ్చ పంజరంలో వైఎస్ చిలుకలు... వారి ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడల్లా ఏం పలకమంటే, అవే పలుకుతున్నాయనే విమర్శ వెల్లువెత్తుతోంది.