కొండా దెబ్బ‌కు తోక‌ముడిచిన ష‌ర్మిల‌

త‌న‌పై ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేసినా, స‌వాల్ విసిరినా ... ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ష‌ర్మిల ఇంతెత్తున ఎగ‌ర‌డం చూశాం. అదేంటో కానీ, వైఎస్సార్ అభిమాని, తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ పెట్టిన‌ప్పుడు పెద్ద దిక్కుగా నిలిచిన కొండా రాఘ‌వ‌రెడ్డి స‌వాల్‌కు మాత్రం తోక ముడిచారు. కొండా రాఘ‌వ‌రెడ్డి పేరు ప్ర‌స్తావించ‌కుండా, ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ష‌ర్మిల ముగింపు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం.

ఇదే సంద‌ర్భంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే వెయ్యి కోట్ల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌నే విమ‌ర్శ‌ల‌పై ఆమె స్పందించారు. వామ‌ప‌క్ష నాయ‌కుల‌తో క‌లిసి ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వేసే కుక్క బిస్కెట్ల కోసం ఆశ‌ప‌డి త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల అన్నారు. ముందు మీకు ఎంత సొమ్ము ఇచ్చారో చెప్పాల‌ని కొండా రాఘ‌వ‌రెడ్డిని ఆమె ప్ర‌శ్నించారు. వెయ్యి కోట్లు కాదు ప‌ది వేల కోట్లు అడిగాన‌ని కూడా చెబుతార‌ని ఆమె వెట‌క‌రించారు. 

వైఎస్సార్ మ‌ర‌ణం వెనుక రిల‌య‌న్స్ హ‌స్తం వుంద‌ని ఒక‌ప్పుడు జ‌గ‌న్ అన్నార‌ని ఆమె గుర్తు చేశారు. అంద‌రూ న‌మ్మార‌న్నారు. రిల‌య‌న్స్ సంస్థ‌ల‌పై దాడులు చేసి కేసుల్లో కూడా ఇరుక్కున్నార‌ని ఆమె చెప్పారు. ఆ త‌ర్వాత అవ‌స‌రం తీరాక‌, జ‌గన్ సీఎం అయ్యాక‌, రిల‌య‌న్స్ సంస్థ‌కు చెందిన వ్య‌క్తికి ఎంపీ ప‌ద‌వి కూడా ఇచ్చార‌ని ఆమె విమ‌ర్శించారు. 

తాను వెయ్యి కోట్లు అడిగిన‌ట్టు రుజువు వుందా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. మీరు రుజువు చేస్తే రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మిస్తాన‌ని ష‌ర్మిల తెలిపారు. ఒక్క పైసా సాయం కూడా తాను అడ‌గ‌లేద‌ని ఆమె చెప్పారు. అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు మాట్లాడ్డం వీళ్ల‌కు అల‌వాట‌ని ఆమె విమ‌ర్శించారు. 

అవ‌స‌ర‌మైతే పాద‌యాత్ర చేయ‌మంటార‌ని, లేదంటే అస‌లు నువ్వు రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డ‌వే కాదంటార‌ని విమ‌ర్శించారు. వీళ్ల విమ‌ర్శ‌ల‌ను ఎవ‌రు లెక్క పెడ‌తార‌ని ప్ర‌శ్నించారు. వాటిని విడిచి పెట్టాల‌ని ఆమె కోరారు. ఇడుపులపాయ‌లో చ‌ర్చ‌కు రావాల‌నే కొండా రాఘ‌వ‌రెడ్డి స‌వాల్‌పై మాత్రం ఆమె వెన‌క్కి త‌గ్గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.