'అబ్బే.. జనాలు ఎవరికైనా వస్తారు, వచ్చే జనాలంతా ఓటేయరు, బిర్యానీ ప్యాకెట్ కోసం జనాలొస్తారు.. ' ఇలాంటి రొటీన్ కామెంట్లను కాసేపు పక్కన పెడితే.. ఇంతకీ జగన్ సభలకు ఆ జనసందోహం ఏమిటనే టాపిక్ ఇప్పుడు ఏపీలో చర్చగా మారుతోంది! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితే ఆ జనసందోహాలను చూసి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు! అసలు వారే ఊహించని స్థాయిలో జగన్ ఎన్నికల ప్రచార సభలు సాగుతున్నాయి!
ఎక్కడ మొదలైంది ఇది.. అంటే రాప్తాడులో అని చెప్పాలి! అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి సిద్ధం సభను నిర్వహించింది! ఆ సభ ఏ రేంజ్ లో హిట్ అంటే.. అక్కడకు చేరిన భారీ జనసందోహాన్ని తమిళ టీవీ చానళ్లు కూడా చూపించి ఆశ్చర్యం వ్యక్తం చేశాయి! రాజకీయ పార్టీ ఏదైనా భారీ సభను నిర్వహిస్తోందంటే.. జనసమీకరణ సహజంగానే జరుగుతుంది. అయితే అది ప్రభుత్వ కార్యక్రమంగా జరిగినప్పుడే పార్టీలు వీలైనంత ఎక్కువ జన సమీకరణ చేయగలుగుతాయి. అయితే రాప్తాడులో జగన్ పాల్గొన్నది ప్రభుత్వ కార్యక్రమం కాదు. అది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. కాబట్టి.. డ్వాక్రా మహిళలనో, మరొకరినో బెదిరించి బస్సులు ఎక్కించే పరిస్థితి ఉండదు!
ఖర్చు, బస్సులు గట్రా కూడా పార్టీ పెట్టుకోవాల్సిందే! అయితే రాప్తాడు సిద్ధం సభకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు! అప్పటికే ఎండలు పెరుగుతున్నాయి. అలా మొదటి సిద్ధం మీటింగే జనసంద్రాన్ని తలపించింది! జగన్ జనం ముందుకు రావడం లేదు, జనం ముందుకు రావడానికే జగన్ భయపడుతున్నాడంటూ గోబెల్స్ ప్రాపగండాను సాగించిన టీడీపీకి సిద్ధం సభలు గొంతులో పచ్చివెలగకాయల్లా పడ్డాయి! అవే అనుకుంటే.. ఇక రోజుకు మూడు సభలో ప్రస్తుతం జగన్ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది! మూడు పూట్లా వాటిని పరిశీలించినా.. ఒకదానికి మించినట్టుగా మరోటి ఉంటోంది!
ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి! ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నా.. భరించలేనంత ఉక్కపోత! చరిత్రలోనే రికార్డులకు ఎక్కుతున్న ఎండకాలం ఇది! ఎలాంటి వారు అయినా ఇళ్లు దాటి కదలడానికి ఆలోచించుకునే పరిస్థితి. జగన్ మీద అభిమానం ఉన్నా.. ఆ మండుటెండల్లో ఆ జనసమూహంలోకి రావడానికి భయపడే వాళ్లు బోలెడంతమంది ఉంటారు! వారి సంగతెలా ఉన్నా.. 42 డిగ్రీల ఎండలో.. మిట్టమద్యాహ్నం జనాలు కిక్కిరిసిన చోటకు వస్తున్న జనం మాత్రం మంత్రముగ్ధులను చేస్తున్నారు ఎవరినైనా! జనం కోసం జగనా, జగన్ కోసం జనమా.. అన్నట్టుగా ఆ దృశ్యాలుంటున్నాయి!
డబ్బులు ఇస్తామంటేనో, బీరుకో బిరియానీకో అంత సందోహం సమకూరడం అసంభవం! జగన్ ఇప్పుడు ఒక ఎమోషన్ గా మారిపోయాడు! జగన్ ను వ్యతిరేకించేవాళ్లు ఐదేళ్లుగా నిద్రపోకుండా ఆ పని చేస్తూనే ఉన్నారు! అయితే జగన్ అనుకూలురు జగన్ కోసం ఈ ఎన్నికల వేళ అతడెక్కడకు వెళితే అక్కడ ఉంటున్నారు! రాయలసీమ, కోస్తా, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ఇలాంటి తేడాల్లేకుండా జగన్ ఎన్నికల ప్రచార సభలు ప్రతి చోటా జనసునామీని తలపిస్తున్నాయి!
జగన్ ఏమీ సినిమా స్టార్ కాదు, జగన్ కు ఇవి తొలి ఎన్నికలూ కాదు, జగన్ ఏమీ గత ఐదేళ్లూ ప్రతిపక్ష వాసమూ చేయలేదు! ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు కాబట్టి.. ప్రజావ్యతిరేకతే ఉంటే, జగన్ కోసం జనం కాదు కదా, సొంత పార్టీ వాళ్లు కూడా కదిలిరారు! ప్రత్యర్థులు పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, సమీకరణాల మీద ఆశలు పెట్టుకుంటుంటే.. జగన్ మాత్రం జనం మీదే తన నమ్మకంతో సాగుతున్నాడు! అందుకు తగ్గట్టుగా జనస్పందన కనిపిస్తూ ఉంది!