దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో రాయించ‌డానికేః జ‌గ‌న్

దేవుడు ఇంకా మ‌న‌తో ఏదో పెద్ద స్క్రిప్ట్ రాయించ‌డానికే దాడి నుంచి త‌ప్పించాడ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క కామెంట్స్ చేశారు. మ‌న‌మంతా సిద్ధం బ‌స్సుయాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌తో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ త‌న క‌న్ను, క‌ణ‌తిని చూపుతూ... దెబ్బ ఇక్క‌డ త‌గ‌ల‌కుండా చేయ‌డం వెనుక దేవుడి స్క్రిప్ట్ వేరేలా వుంద‌ని అన్నారు.

ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాయించ‌డానికే దేవుడు త‌న‌కు ప్రాణ‌పాయం లేకుండా చేశార‌నే అర్థం ధ్వ‌నించేలా జ‌గ‌న్ మాట్లాడారు. అలాగే త‌న‌పై జ‌రిగిన దాడిని చూస్తే మ‌నం మ‌రోసారి అధికారంలోకి రాబోతున్నామ‌ని, అలాగే ప్ర‌తిప‌క్షాలు దూర‌మ‌వుతున్నాయ‌నే భ‌యం కనిపిస్తోంద‌ని చెప్పుకొచ్చారు. చేతిలో సెల్‌ఫోన్ వున్న వాళ్లంతా వైసీపీ వైపే ఉన్నార‌న్నారు. సోష‌ల్ మీడియా వైసీపీకి అండ‌గా వుంద‌ని ఆయ‌న చెప్పారు.

175కు 175 అసెంబ్లీ, అలాగే 25 లోక్‌స‌భ స్థానాల్లో మ‌న‌మే గెలుస్తున్నామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. మ‌నం కూట‌మి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నామ‌న్నారు. చంద్ర‌బాబు, ద‌త్త‌పుత్రుడి కుట్ర‌ల‌తో యుద్ధం చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ విమ‌ర్శించారు. తాను ఒక్క‌డినీ ఒక‌వైపు, చంద్ర‌బాబు, ద‌త్త‌పుత్రుడు, ఇత‌రులంతా మ‌రోవైపు ఉన్నార‌ని జ‌గ‌న్ చెప్పారు. ఎన్నిక‌ల కురుక్షేత్రంలో ఒకే ఒక్క‌డిగా తాను దిగుతున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇక ఎన్నిక‌ల‌కు కేవ‌లం 18 రోజుల స‌మ‌యం మాత్ర‌మే వుంద‌న్నారు. ప్ర‌త్య‌ర్థుల కుట్ర‌ల్ని, కుతంత్రాల్ని సోష‌ల్ మీడియా సైన్యం తిప్పి కొట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

సోష‌ల్ మీడియాలో టీడీపీ, దాని మిత్ర‌ప‌క్షాలు దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. టీడీపీ, దాని మిత్ర‌ప‌క్షాల దిగ‌జారుడుత‌నానికి గీతాంజ‌ని ఆత్మ‌హ‌త్య నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.