గ‌తేడాదిలో అమెరిక‌న్లైన ఇండియ‌న్స్ 60 వేల మంది!

2022- అక్టోబ‌ర్ నుంచి 2023 - సెప్టెంబ‌ర్ ముగిసే వ‌ర‌కూ అమెరికా దేశ పౌర‌స‌త్వం పొందిన భార‌తీయుల సంఖ్య 60 వేలు అని చెబుతున్నాయి గ‌ణాంకాలు. భార‌త గ‌డ్డ‌పై పుట్టిన 60 వేల మంది గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో అమెరికా పౌర‌స‌త్వం పొందార‌ని తెలుస్తోంది. అమెరికా పౌర‌స‌త్వం పొందిన ఇత‌ర దేశ‌స్తుల్లో ఇలా ఇండియ‌న్స్ రెండో స్థానంలో నిలిచారు. 

ఆ ఆర్థిక సంవ‌త్స‌రంలో మొత్తం 8,70,000 మంది ఇత‌ర దేశస్తుల‌కు అమెరికా త‌న పౌర‌స‌త్వాన్ని ఇచ్చింది. వారిలో మెజారిటీ మెక్సిక‌న్లున్నారు. మొత్తంలో మెక్సిక‌న్ల వాటా 1,10,000 మంది వ‌ర‌కూ ఉంది.

ఆ త‌ర్వాత భార‌తీయులు సుమారు 59 వేల మందికిపైగా ఉన్నారు. మూడో స్థానంలో పిలిఫైన్స్ దేశ‌స్తులున్నారు. వారి సంఖ్య సుమారు 45 వేలు. నాలుగో స్థానంలో డొమియ‌న్ రిప‌బ్లిక్, ఆ త‌ర్వాత కూబా దేశ‌స్తులున్నారు. విశేషం ఏమిటంటే.. అంత‌కు ముందు ఏడాదిలో కూడా ఈ దేశాల వాళ్లు ఇదే వ‌ర‌స‌లో అమెరికా పౌర‌స‌త్వాన్ని పొందారు.

2022 సమ‌యంలో సుమారు 65 వేల‌మంది భార‌తీయులు అమెరికన్ పౌర‌స‌త్వం పొందారు. మెక్సిక‌న్ల వాటా అప్పుడు ఇంకాస్త ఎక్కువ‌గా ఉంది. ఇతర దేశ‌స్తుల వాటా కూడా ఎక్కువ‌గా ఉండ‌టంతో.. ఆ ఏడాది విదేశాల్లో పుట్టిన వారికి అమెరికా ఇచ్చిన పౌర‌స‌త్వాల సంఖ్య 9 ల‌క్ష‌ల‌కు పైగా ఉంది. అంత‌కు ముందు ఏడాదితో పోలిస్తే గ‌త ఏడాదిలో అమెరికా అటు ఇటుగా 90 వేల పౌర‌స‌త్వాల‌ను త‌క్కువ‌గా జారీ చేసింది.