టీడీపీ...తోక పార్టీ మారాల్సిందేనట...

టీడీపీ అయితే ఓకే. తోక పార్టీ ఎవరు. ఈ విషయాన్ని వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ చెప్పలేదు. ఎవరికి నచ్చినట్లుగా వారు దానికి అర్ధం చెప్పుకోవచ్చు. ఆ పార్టీ ఏంటో పేరు కూడా చెప్పుకోవచ్చు. సుప్రీం కోర్టు అమరావతి రాజధాని మీద రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద విచారణ చేస్తూ కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. 

రాజధాని అదే ప్రాంతంలో ఉండాలని కానీ ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైసీపీకి కొత్త జోష్ ని ఇస్తున్నాయి.

వరసబెట్టి మంత్రులు మీడియా ముందుకు వచ్చి టీడీపీని చెడా మడా విమర్శిస్తున్నారు. తాము అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటే టీడీపీ మాత్రం అమరావతే రాజధాని అంటూ మొండిగా మాట్లాడుతోందని గుడివాడ అమరనాధ్ మండిపడ్డారు. అమరావతితో సహా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే జగన్ అజెండా అని ఆయన స్పష్టం చేశారు.

అయితే టీడీపీ తన వాదనతో ఇబ్బందులు సృష్టించాలని చూసిందని సుప్రీం కోర్టు తాజా కామెంట్స్ తో అయినా టీడీపీ ఆలోచనలు మార్చుకుంటే మంచిదని సూచించారు. టీడీపీని అనుసరిస్తున్న తోక పార్టీ కూడా ఏపీ అభివృద్ధి రాజధానుల విషయంలో మారాల్సి ఉందని అన్నారు. ఆ తోక పార్టీ ఏమిటి అన్నది ఆయన చెప్పలేదు. 

ఇవన్నీ చూస్తూంటే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను పట్టుకుని టీడీపీని, తోక పార్టీతో పాటు విపక్షాలను మంత్రులు ఘాటైన పదజాలంతో అటాక్ చేస్తున్నారు అనిపిస్తోంది. మౌనమే నా మాట అంటున్న టీడీపీ రేపటికి అయినా తేరుకుని తనదైన వాదన అమరావతి మీద వినిపిస్తుందేమో చూడాలి.