మునుగోడు టీఆర్ఎస్ లో రెబెల్స్ భ‌యం!

మునుగోడు శాస‌న‌స‌భ‌కు జ‌రుగబోతున్న‌ ఉప ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందా? తాజగా టీఆర్ఎస్ లో జ‌రుతున్న పరిణామ‌లు అలాగే క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి అభ్య‌ర్ధి అయితే రెబ‌ల్స్ బెడద‌ ఉండ‌బోతోంది. మునుగోడులో జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నాయ‌కుల మీటింగ్ నే దీనికి నిద‌ర్శ‌నం.

మునుగోడు ఉపఎన్నికల్లో పోటీకి తెరాస నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లు ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్ల తెరాస కీలక నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కూసుకుంట్ల‌కు టికెట్ ఇవ్వొద్దంటూ మునుగోడు స్ధానిక పార్టీ నాయ‌కులు కొంద‌రు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. కూసుకుంట్ల ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో మ‌నిషి కాద‌ని, కార్యక‌ర్త‌లు అత‌నితో ప‌ని చేయర‌ని టికెట్ ఇస్తే ఓడిపోతారంటూ... అభ్య‌ర్థిని మార్చ‌ల‌ని కొంద‌రు నేత‌లు కోరుతున్నారు.

ఈ పరిణామాల నేప‌థ్యంలో ఒక‌రికి టికెట్ ఇస్తే ఇంకొక‌రి విజ‌యం కోసం ప‌ని చేస్తారా లేక రెబెల్స్ గా మారి ఓట‌మికి ప‌ని చేస్తారా అనేది తెరాస అధినాయ‌క‌త్వం అలోచ‌న‌లో ప‌డింది. ఇందులో భాగంగా మునుగోడులో జ‌రిగే భారీ బహిరంగ స‌భ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల రెబ‌ల్స్ బెడ‌ద బీజేపీకి అనుకూలించే ప‌రిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ నుండి తాజ మాజీ ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి ఒక‌రే అభ్య‌ర్ధి.