స్టీల్ ప్లాంట్ కి రోజులు దగ్గర పడ్డాయా...?

కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోంది అంటూ సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ బంగారం లాంటిదని, ఏపీకే మణిహారమని, అలాంటి ప్లాంట్ గొంతు తెగ్గోయడానికి అనేక రకాలైన కుట్రలు చేస్తోందని ఆయన నిప్పులు చెరిగారు.

ఉక్కు కర్మాగారం విషయంలో ఇప్పటిదాకా నష్టాలు అని చెబుతూ వచ్చిన కేంద్ర పెద్దలు లాభాల బాటలో ప్లాంట్ నడుస్తూండడంతో కేంద్రం కొత్త ఎత్తులు వేస్తోందని విమర్శించారు. ప్లాంట్ ఉత్పత్తిని దారుణంగా తగ్గించేశారని, 24 వెల టన్నుల ఉత్పత్తికి గానూ ప్రస్తుతం 15 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

అంటే ఉత్పత్తిని బాగా తగ్గించి ఏదో కాడికి ఏదో నాటికి ప్రైవేట్ పరం చేయాలన్నదే కేంద్రం కుట్ర అని ఆయన ఫైర్ అయ్యారు. దాదాపుగా ఏణ్ణర్ధ కాలంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఆందోళలను చేస్తున్నా కూడా కేంద్రం కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని వామపక్షాలు మొదటి నుంచి ఆందోళన చేస్తున్నాయి. ఒక దశలో ఉద్యమాన్ని పీక్స్ కి తీసుకెళ్లాయి. అయినా సరే కేంద్రం దూకుడు చేయడంతో ఇపుడు వామపక్షాలు కూడా కేంద్రం తీరు మీద మండిపడుతూనే ప్రైవేటీకరణ జరిగిపోతుందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రుల హక్కు ఈ విధంగా ఏమీ కాకుండా ఎవరికీ లెక్క లేకుండా కేంద్రం శాసనం మేరకు అలా వేటు పడి బలి కావడం అంటే ఎలా అర్ధం చేసుకోవాలి అని అంటున్నారు. కార్పోరేట్లకే కేంద్రం వత్తాసుగా ఉందని కామ్రేడ్స్ చేస్తున్న ప్రకటనలు చూస్తే స్టీల్ ప్లాంట్ కి రోజులు దగ్గర పడ్డాయనే అంటున్నారు అంతా.