ఛీఛీ! వీళ్లు మీడియా ప్రతినిథులా?

జర్నలిజం నిష్పక్షపాతంగా పని చేసి దశాబ్దాలు గడిచాయి. దేశమంతా ఇదే జాడ్యముంది. అయితే తెలుగునాట ఇది మరింత ముదిరిన జబ్బు. 

1980ల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్.టీ.ఆర్ ని మోసినా అదంతా తెలుగువాడి ఆత్మగౌరవం అకౌంట్లో సర్దుకుపోయింది. అప్పట్లో అదొక ఉద్యమం. తెలుగువారికంటూ ఒక ప్రాంతీయపార్టీ లేకపోవడం, కేంద్రపార్టీల నీడలో బతకాల్సిరావడం వంటి అంశాలు ప్రాంతీయతాభావాన్ని పెల్లుబికేలా చేసాయి. కనుక ఈనాడు అప్పట్లో అధికశాతం తెలుగువారి పత్రిక అయ్యింది. 

అయితే క్రమంగా ఎన్.టి.ఆర్ ఏలుబడిలో ఈనాడుకి ప్రత్యామ్నాయంగా ఉదయం వెలసింది. ఒకటి తెలుగుదేశం పత్రిక, మరొకటి కాంగ్రెస్ పత్రికగా కొనసాగాయి. ఒక పార్టీకి కొమ్ముగాసే పత్రికలు అలా మొదలయ్యాయి. 

కానీ చంద్రబాబు హాయాము నుంచి సీన్ మారిపోయింది. జర్నలిజాన్ని కొనడం మొదలుపెట్టాడు. 

అప్పటి వరకు ప్రెస్ మీట్స్ లో కాఫీలు, బిస్కెట్స్ మాత్రమే ఇచ్చేవారు. కానీ చంద్రబాబు రాజకీయం మాత్రం జర్నలిస్టుల్ని డబ్బుకి, సుఖాలకి బానిసల్ని చేయడంతో మొదలయ్యింది. 

ప్రెస్ మీట్స్ లో భోజనాలు పెట్టడం మొదలుపెట్టారు. ఖరీదైన బహుమతులివ్వడం, కొందరికి డబ్బు ముట్టజెప్పడం వంటివి జరిగేవి. విలువలకి కట్టుబడి అటువంటి ప్రలోభాలకి గురికాకూడదని కొందరు వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. కానీ తోటి వారిని చూసి నెమ్మదిగా వారు కూడా దారితప్పారు. విలువలకి వలువలిప్పేసి డబ్బు బాట పట్టారు. ఆ ఘనత చంద్రబాబుదే. ఇదంతా 1990లనాటి మాట. 

కాలక్రమంలో జర్నలిజమంటే ఒక పార్టీకి వంతపాడి డబ్బుచేసుకోవడమనే ధోరణి మొదలయ్యింది. ప్రజలు కూడా ఈ ప్రక్రియకి తప్పుపట్టకపోగా ఆయా పేపర్లని, ఛానల్స్ ని క్రికెట్ మ్యాచ్ చూసినట్టో, రియాలిటీ షో చూసినట్టో చూస్తున్నారు. కనుక జర్నలిజమనేది దైనందిన వినోదాంశంగా మారిపోయింది. ఎంత వివాదముంటే అంత వినోదం కింద ప్రజలు చూస్తున్నారు. పత్రికల సేల్స్ పెంచుతున్నారు, చానళ్ల టీఆర్పీలు పెంచుతున్నారు. కనుక జర్నలిజంలో చంద్రబాబు నాటిన విషబీజాలు మొలకెత్తడానికి ఇలా ప్రజల గాలి కూడా తోడయ్యింది. 

అంత వరకు సరే. కానీ క్రమంగా మీడియాప్రతినిథులు భాషవిషయంలో హద్దు దాటి పోయి ప్రవర్తిస్తున్నారు.

నిన్నటికి నిన్న టీవీ5 సాంబశివరావు గోరంట్ల మాధవ్ వీడియో నిజమో కాదో తెలియడానికి ఫోరెన్సిక్ ఎందుకు..ఇంట్లోని స్త్రీలకి చూపిస్తే చాలదా అన్నాడు. ఇతను మీడియా ప్రతినిథా? 

ఇదే చానల్లో పనిచేస్తున్న మూర్తి... ఎం.పీ గోరంట్ల మాధవ్ భాష గురించి వాపోతూ క్లాసు పీకే ప్రయత్నం చేసాడు. ఇంటిని చక్కబెట్టుకున్నాక ఊరి మీద పడి పాఠాలు చెప్పొచ్చు. ఈ మూర్తికి తన పక్కన ఉన్న సాంబశివరావు కనపడలేదా? ముందు అతనికి కదా క్లాసు పీకాల్సింది భాష జాగ్రత్తని!

ఏబీయన్ వెంకటకృష్ణైతే జిప్పు తీసి వీడియో తీయాలా అంటూ మరొక డి-గ్రేడ్ పదజాలం వాడాడు. అలాగే గతంలో ఒక వివాదంలో "చెత్త నాకొడుకు" అంటూ ఎవర్నో ఉద్దేశిస్తూ అన్నాడు. 

వీళ్లు మీడియాప్రతినిథులా? 

వెనకేసుకుని రావడానికి ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు వీళ్లని ఏ రేంజులో పోషిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. 

అయితే ఇక్కడొక విషయం ఉంది. ఆంధ్రలో ఈ టీవీ5, ఏబీయన్ చూసి ప్రభావితం చెందే జనాభా ఉన్నా కూడా బహుతక్కువ. ఎలా లెక్కేసుకున్నా వాళ్ల ఓటు బ్యాంక్ రాష్ట్రంలోని ప్రభుత్వ మార్పును నిర్ణయించలేదు. దీనికి 2019 ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. అయితే ఆ ఛానల్స్ ని ఫాలో అవుతున్న ప్రజలు మాత్రం టెర్రరిస్టుల ట్రైనింగులో మైండ్ వాష్ చేయబడ్డ కసబ్బుల్లాగ తయారయ్యారు. వాళ్లకి చంద్రబాబే దేవుడు, అతనే యావజ్జీవ ముఖ్యమంత్రి. అలా ట్రైనింగిస్తున్నాయి ఈ ఛానల్స్, పత్రికలు. 

నిజంగా ఎన్నికలొస్తే ఫలితాలు చూసి తుస్సుమంటున్నాయి ఈ మీడియా సంస్థలు. గతంలో చంద్రబాబు నెగ్గినా కూడా అంతా బలమైన కేంద్ర పార్టీతో పొత్తుల మహత్యం తప్ప ఈ సైకిల్ పంపు కొట్టే వార్తలు కాదనేది సత్యం. 

ఇప్పటికైనా మారాల్సింది కనీసం ఒక్కటి. మీడియా ప్రతినిథుల భాష. రాజకీయనాయకులు ఎలాగైనా వాగుతారు. మీడియా వారు అలా మాట్లాడకుండా ఉండాలన్న నియమం, నిగ్రహం తప్పనిసరి. లేకపోతే రోడ్డు సైడు రిఫ్రాఫులకి జర్నలిస్టులకి తేడా ఏముంటుంది?

- శ్రీనివాసమూర్తి