శవంతో పెళ్లికి ఒప్పుకునేదెవరు రఘురామా?

రఘురామరాజుకు తనను ఎంపీని చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప.. తతిమ్మా అన్ని పార్టీల మీద ప్రేమ వెల్లువెత్తుతూ ఉంటుంది. ఢిల్లీలో సమావేశానికి వెళ్లి.. ప్రధాని తనతో కాస్త ప్రెవేటుగా మాట్లాడగానే.. అక్కడికేదో ఇరు పార్టీల మధ్య వీరబీభత్స మంతనాలు జరిగినట్టుగా చంద్రబాబునాయుడు డప్పు కొట్టించుకుంటే.. ఆ విన్యాసాలకు ఈ రఘురామ కూడా వంత పాడుతున్నారు. వైసీపీ నాయకులు చంద్రబాబు కుటిలప్రచారాన్ని తిప్పికొడుతోంటే.. రఘురామరాజు వకాల్తా పుచ్చుకుంటున్నారు. వాళ్లిద్దరూ (చంద్రబాబూ, మోడీ అన్నమాట) ఇష్టపడితే మధ్యలో వైసీపీ నాయకులకు ఏంటి ఇబ్బంది అంటూ తన సందేహాలను లేవనెత్తుతున్నారు.

కేంద్రంలోని కమల నాయకులతో రాసుకుపూసుకు తిరుగుతూ.. పవన్ కల్యాణ్ తో ప్రేమనుబంధాన్ని కొనసాగిస్తూ.. ఆయనతో తన గురించి స్తోత్ర పాఠాలు చదివించుకుంటూ.. తెలుగుదేశాన్ని తాను ఆకాశానికెత్తేస్తూ అందరితోనూ రఘురామరాజు ప్రేమగా వ్యవహరిస్తుంటారు. తాజాగా తెలుగుదేశం పార్టీ మీద తన ప్రేమాభిమానాలను చాటుకోవడానికి కొత్త జోస్యం చెబుతున్నారు. అయితే ఈ జోస్యం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినది కాదు. తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం గురించి! రఘురామకృష్ణంరాజు కొత్త ముచ్చట ఒకటి బయట పెడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ- తెలుగుదేశం కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నదని రఘురామ ఉవాచ! అలాంటి చిత్రమైన ఊహ ఆయనకు ఎలా పుట్టిందో మనకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇవ్వడానికి అదేమైనా ఉపయోగపడుతుందేమో తెలియడం లేదు. 'తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పొత్తు పెట్టుకుంటుందని' రఘురామ జోస్యం విన్నవారు మాత్రం ఆ కామెడీకి తెగ నవ్వుకుంటున్నారు.

ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరణించి చాలా కాలమైంది! శవంతో పెళ్లి చేసుకోవడానికి ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? మరణించిన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు ముందుకు వస్తుంది? ఈ కనీస అవగాహన, లాజిక్ లేకుండా రఘురామకృష్ణంరాజు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని జనం భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ- తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో సర్వనాశనం అయిపోయింది. 

తెలుగుదేశంతో కలిసి అడుగులు వేయకుండా ఉంటే కనీసం మరో 20 సీట్లు అయినా అదనంగా గెలిచి ఉండేవాళ్ళం అని కాంగ్రెస్ సీనియర్లు ఇప్పటికీ క్షోభ పడుతున్నారు. ఆ రకంగా తాను ఎన్నడో పతనమైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ... 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు కూడా మరణ శాసనం లిఖించింది. అదే తెలుగుదేశం హస్తాలతో తమకు కూడా మరణ శాసనం రాయించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉత్సాహపడుతుంది? ఇంత అయోమయం రఘురామకృష్ణంరాజుకు ఎందుకు కలిగినట్లు?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒకరి చేయూత కోసం దేబిరించే పరిస్థితిలో లేదు. తన చేతుల మీదుగా పార్టీ నిర్వహణ మొదలైన తొలినాటి నుంచి ప్రతి ఎన్నికల్లోను ఎవరో ఒకరి భుజాల సాయం అందుకొని నెగ్గుతూ వచ్చిన చరిత్ర చంద్రబాబుకు మాత్రమే ఉంది. తెలంగాణ బిజెపి ఎన్నికల సమరం ఎప్పుడు వచ్చినా సర్వసన్నద్ధంగా బరిలో దిగడానికి ఉవ్విళ్ళూరుతోంది. అంతో ఇంతో తెలంగాణలో కూడా బలం ఉన్న జనసేన పార్టీ టెక్నికల్గా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. తాము స్వతంత్రంగా ముందుకు సాగడానికి బిజెపి వ్యూహరచన చేస్తోంది. 

ఏమాత్రం బలం లేని శవంతో సమానమైన తెలుగుదేశంతో బంధం కుదుర్చుకోవడానికి ఎలా ఆలోచిస్తుంది. అందుకే రఘురామ మాటలు.. పైత్యం ప్రకోపించిన ప్రేలాపనల్లా ఉన్నాయని జనం నవ్వుకుంటున్నారు!!