వీళ్లు ఖర్చు తగ్గిస్తారట!

టాలీవుడ్ నిర్మాతలు గిల్డ్ గా ఫార్మ్ అయ్యారు. నిర్మాణ వ్యయం ఎలాగైనా తగ్గించాలని కంకణం కట్టుకున్నారు. ఎలా తగ్గించాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అందుకోసం కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు. డిస్కషన్లు సాగిస్తున్నారు. అందుకోసం సినిమాల నిర్మాణాలు కూడా ఆపేసారు. ఇదంతా చూస్తుంటే నిజంగానే ఖర్చులు తగ్గించేస్తారేమో అని అనుమానం వచ్చేస్తోంది కూడా.

కానీ గమ్మత్తుగా ఈ రోజు జ‌రిగిన ఓ సంఘటన చూస్తుంటే టాలీవుడ్ నిర్మాతలు ఖర్చు పెంచుకోవడం తప్ప తగ్గించుకోలేరు అని క్లారిటీ వచ్చేసింది. కార్తికేయ 2 హీరో నిఖిల్..హీరోయిన్ అనుపమ, కమెడియన్ హర్ష కలిసి వైజాగ్ ప్రచారానికి వెళ్లారు. ఫ్లయిట్ టికెట్ లు వేసుకుని వెళ్లి వచ్చి వుంటే మహా అయితే యాభై వేలు కూడా ఖర్చు కాదు.

కానీ స్టార్ హీరోలు అంతా చార్టర్ ఫ్లయిట్ వేసుకుని తిరుగుతున్నారు. మనం ఎందుకు తిరగకూడదు అనుకున్నాడేమో హీరో నిఖిల్. లేదా మనకేం తక్కువ అని నిర్మాతలు పీపుల్స్ మీడియా అనుకుందో మొత్తం మీద 12 లక్షల వరకు ఖర్చు చేసి ప్రైవెట్ విమానంలో వీళ్లను విశాఖ పంపి ప్రచారం సాగించారు.

ఇప్పుడు చెప్పండి..ఇలాంటి వృధా ఖర్చులు పెట్టే నిర్మాతలు అంతా కలిసి నిర్మాణ వ్యయం తగ్గించేస్తారు అంటే నమ్మబుద్ది అవుతోందా?