కేంద్రం కంటే .. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి బాగుంది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్దిక పరిస్థితి కేంద్రప్రభుత్వం కంటే మెరుగ్గా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయుకుడు వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని అనేక ధనిక రాష్ట్రాలు చేసిన అప్పులతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ చాలా మెరుగైన పరిస్థితులలో ఉందని గణాంకాలతో సహా ఆయన వివరించారు.

ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో గురువారం పార్టీ లోక్‌ సభాపక్ష నాయకుడు పి.వి. మిధున్‌ రెడ్డితోపాటు పార్టీకి చెందిన పలువురు ఎంపీలతో కలసి విజ‌య‌సాయి రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమర్ధుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పధంలో నడుస్తోందని అన్నారు. 

2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ అప్పులు-జీడీపీ నిష్పత్తి 57% ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 32.4% మాత్రమే ఉంది. పంజాబ్ 47%, రాజస్థాన్ 39.8%, పశ్చిమ బెంగాల్‌ 38.8%, కేరళ 38.3%తో ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్నాయని తెలిపారు.

ఈ నెల 19న శ్రీలంకలో జరిగిన పరిణామాలపై కేంద్ర ఆర్దిక మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రుల ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంకలోని పరిణామాలు, ఆ దేశానికి ఎలా సహాయపడగలం అన్న విషయాలపై చర్చ మొదలెట్టి ఆశ్చర్యకరంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్దిక పరిస్థితులపైకి దానిని మళ్ళించారని  విజయసాయి రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, ఉత్పత్తి, అప్పులపై మంత్రులు వివరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, కేంద్రం చేసిన అప్పుల గురించి మాత్రం సమావేశంలో ప్రస్తావించకపోవడం విశేషం.

రుణాలు - జీఎస్డీపీ నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు 8,500 కోట్లు. ద్రవ్యలోటు 25,194.62 కోట్లని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్ర ద్రవ్యలోటు జీఎస్డీపీతో పోల్చకుంటే కేవలం 2.1%కన్నా తక్కువగానే ఉంది. ఇది 15వ ఆర్దిక సంఘం సూచించిన 4.5% పరిమితి కంటే తక్కవగానే ఉందని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 6.9% ఉంటే ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు కేవలం 3.18% మాత్రమే ఉందని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా అయిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వాస్తవాలు తెలసుకోవాలని ఆయన అన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం ఆ దేశం నుంచి ఎగుమతులు భారీగా క్షీణించాయి. విదేశీ చెల్లింపులు (రెమిటెన్స్)లు గణనీయంగా తగ్గిపోయాయి. వ్యవసాయోత్పత్తులు తగ్గి, టూరిజం ఆదాయం దారుణంగా పడిపోయింది. శ్రీలంక‌ కరెన్సీ విలువ పడిపోయింది. పైగా శ్రీలంక‌ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడినందున విదేశీ మారకద్రవ్యం మొత్తం ఆవిరైపోయింది. శ్రీలంక సంక్షోభానికి ఇవే ప్రధాన కారణాలని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.  2019-20 సంవత్సరానికి శ్రీలంక వ్యాపార ఎగుమతులు 12.9 బిలియన్ డాలర్లు. ఆంధ్రప్రదేశ్ ఎగుమతులు 85,665 కోట్లు. 2021లో శ్రీలంక మొత్తం ఎగుమతులు 12 బిలియన్ డాలర్ల వద్దే స్తంభించిపోయింది. 

ఏపీ ఎగుమ‌తులు ఏకంగా 62% పెరిగి 2 లక్షల కోట్లకు చేరింది. 2020లో భారతదేశంలోకి వచ్చిన విదేశీ చెల్లింపులు 83 బిలియన్ డాలర్లు. శ్రీలంకకు వచ్చింది 7.1 బిలియన్ డాలర్లు మాత్రమేనని అన్నారు. 2021-22లో విదేశీ చెల్లింపులు భారతదేశంలో 87 బిలియన్ డాలర్లకు పెరిగింది. శ్రీలంకకు వచ్చిన విదేశీ చెల్లంపులు 5.49 బలియన్ డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన విదేశీ చెల్లింపులు 4.35 బిలియన్ డాలర్లని అన్నారు. విదేశీ చెల్లింపులు అందుకోవడంతో ఏపీ సుస్థిర పెరుగుదల నమోదు చేసిందని అన్నారు. ఈ కారణాల నేపథ్యంలో శ్రీలంక సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్‌కు ఏ విధంగా పోలిక పెడతారని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపేణా వచ్చిన మొత్తంలో 41% రాష్ట్రాలకు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్నటికీ వాస్తవంగా అది ఎప్పడూ జరగలేదు. 2015-16లో పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 14.4 లక్షల కోట్లు. వాటి నుంచి కేవలం 34.91% మాత్రమే రాష్ట్రాలకు వాటాగా ఇచ్చింది. అందులో ఏపీకి వచ్చింది 1.50% మాత్రమే. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపేణా వచ్చిన మెత్తం 14.4 లక్షల కోట్ల నుంచి ఏకంగా 28 లక్షల కోట్లకు పెరిగింది.  అయినప్పటికీ అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన వాటా 1.5% నుండి 1.32%కి తగ్గిపోయిందని అన్నారు.  2015-16లో కేంద్ర నిధుల పంపిణీలో ఏపీ వాటా 21,791 కోట్లు. 2021-22 సంవత్సరంలో ఇచ్చింది 35,685 కోట్లు మాత్రమే అన్నారు.