అయ్యన్న అదే మాట.. పదే పదే... ?

టీడీపీకి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకే మాట పదే పదే అంటున్నారు. ఆ మధ్య గుంటూరులో చేసిన హాట్ హాట్ కామెంట్స్ నే ఇపుడు విశాఖలో మీడియా సమావేశంలో మరో మారు చేసారు.

చెత్త పాలన చేసిన వారిని చెత్తనాకొడుకు అనకుండా ఏమంటారు అని నిలదీసే స్థితికి వెళ్ళిపోయారు అయ్యన్నపాత్రుడు. ఏపీలో జగన్ కి పాలన చేతకాదని, ఏపీని భ్ర‌ష్టుపట్టించేశారని ఆయన విమర్శిస్తున్నారు. 

అయ్యన్న విపక్ష నేతగా విమర్శలు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టడంలేదు కానీ ఆయన తన భాష తీరునే మార్చుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. అయినా సరే తాను అలాగే అంటాను, అవే దూషణలు చేస్తాను అంటున్నారు అయ్యన్న వారు.

మరి ఆయన మీద అప్పట్లో కేసులు పెట్టామని వైసీపీ నేతలు అన్నారు. కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు అయ్యన్న, ఇపుడు మళ్లీ ఆయన సేమ్ టూ సేమ్ అవే కామెంట్స్ చేయడంతో వైసీపీ నేతలు మండిపోతున్నారు. ఆయన నోరు తీరు మారదని కూడా అంటున్నారు. 

మరి అయ్యన్న తీరు మారదు కానీ ఆయన రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న వారిని ఇలాగే విమర్శిస్తాను అంటే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే అన్న మాట వైసీపీ నుంచి వినిపిస్తోంది. మొత్తానికి అయ్యన్న ఇలాగే అంటాను, ఇలాగే ఉంటాను అని వైసీపీని గట్టిగానే సవాల్ చేస్తున్నారు.