ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక షాక్‌

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రత్యేక షాక్‌ ఇచ్చింది. ఇటీవల ఏపీలో అత్యంత వివాదాస్పదమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక పాలక మండలి సభ్యుల నియామకంపై ఎదురు దెబ్బ తగిలింది. 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితుల భవిష్యత్‌పై నీలి నీడలు అలుముకున్నాయి.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 24 మంది టీటీడీ బోర్డు సభ్యులతో పాటు 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ రెండు జీవోలు జారీ చేసింది. హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ అయిన టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీ ప్రభుత్వం మార్చిందనే విమర్శలు చెలరేగాయి. 

ఇది సరైంది కాదని పలువురు ప్రభుత్వానికి హితవు చెప్పారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులను నియమించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

భారీ సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడం వల్ల సామాన్య భక్తులకు దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని పిటిషన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ స్వయంప్రతిపత్తిని, స్వతంత్రను జీవోలు ఉన్నాయని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదించారు.

అయితే పిటిషనర్ల వాదనలను ప్రభుత్వ తరపు న్యాయవాది కొట్టిపారేశారు. నిబంధనలనకు అనుగుణంగానే ప్రత్యేక ఆహ్వానితులను నియమించినట్టు ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి షాక్‌ తగిలినట్టైంది.