మ‌రో రెండింటికి వైఎస్సార్ పేరు

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ సొంత జిల్లాలో మ‌రో రెండింటికి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు పెట్టారు. వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న పేరుతో క‌డ‌ప జిల్లా పేరును మార్చిన సంగ‌తి తెలిసిందే. 

టీడీపీ హ‌యాంలో వైఎస్సార్ పేరు మార్చాల‌ని నాటి టీడీపీ, నేడు బీజేపీ ఎంపీ అయిన సీఎం ర‌మేశ్‌నాయుడు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేశారు. అయితే వైఎస్సార్ పేరు మారిస్తే ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే భ‌యంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా క‌డ‌ప‌లో ఆర్టీసీకి అనుబంధంగా ప్రారంభించిన ఏరియా ఆస్ప‌త్రికి డాక్ట‌ర్ వైఎస్సార్ పేరు పెట్ట‌డం విశేషం. అలాగే కడప డిపోకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బస్‌స్టేషన్‌గా నామకరణం చేశారు. వీటిని తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి గురువారం వర్చువల్‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ ప్రారంభించారు.

కడపలో ఆర్టీసీకి చెందిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ వ్యయం రూ.3.8 కోట్లు. మరో రూ.2 కోట్లతో మెడికల్‌ ఎక్విప్‌మెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. 1.6 ఎకరాలలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఆస్పత్రిలో 7 గురు వైద్య నిపుణులు, 25 మంది పారా మెడికల్‌ సిబ్బందితో పాటు, హౌజ్‌ కీపింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. 

రాయ‌ల‌సీమ న‌డిబొడ్డున క‌డ‌ప ఉంటుంది. ఈ ఆస్ప‌త్రికి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు వ‌చ్చి వైద్య సేవ‌లు పొంద‌నున్నారు.