ముక్కుసూటితనంతో చిత్రపరిశ్రమలో భారీ మూల్యం చెల్లించుకున్నట్టు విశ్వ నటుడు కమల్హాసన్ కుమార్తె, ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తరచూ అభిమానులతో తన భావాలను శ్రుతి పంచుకుంటున్న విషయం తెలి సిందే.
తాజాగా చిత్రపరిశ్రమపై అందరూ వేలెత్తి చూపడాన్ని ఆమె గట్టిగా ప్రశ్నిస్తారు. ప్రతి రంగంలోనూ మంచీచెడూ ఉంటాయని, అలాంటప్పుడు చిత్ర పరిశ్రమ వైపు మాత్రమే వేలెత్తి చూపడం ఏంటని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ ప్రపంచంలో కూడా మహిళలపై వేధింపులు, వివక్ష ఉంటాయని చెప్పారామె.
చిత్ర పరిశ్రమలో తానెదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా ఆమె ఏకరువు పెట్టారు. భారత చిత్ర రంగ పరిశ్రమలో అత్యంత ప్రజాభిమానం కలిగిన అగ్ర హీరో కమల్హాసన్ వారసత్వం నేపథ్యంతో వచ్చిన తనూ కూడా ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయారు. దీనికి ప్రధాన కారణం తన వ్యక్తిత్వమే అని ఆమె నిర్మొహమాటంగా చెప్పారు.
‘ఎదుటి వాళ్ల క్యారెక్టర్ నచ్చకపోతే ఎంత పెద్ద మనుషులనైనా నేను లెక్క చేయను. నా అభిప్రాయాలు ఎప్పటికీ ముక్కుసూటిగా ఉంటాయి. ఈ ధోరణి వల్ల సినీరంగంలో నేను ఎన్నో అవకాశాలు పోగొట్టుకుని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
కానీ అవకాశాలు పోయినందుకు ఎప్పుడూ బాధతో ఏడుస్తూ కూర్చోలేదు. ప్రతి రంగంలో ఇది సర్వసాధారణమే. కార్పొరేట్ సంస్థల్ ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో నిక్కచ్చిగా వ్యవహరించి ఉద్యోగాలు కోల్పోయిన మహిళలు చాలా మందే ఉంటారు. కాబట్టి ఒక్క సినీరంగానికి మాత్రమే అవలక్షణాల్ని అంటకట్టొద్దు. ప్రతి మహిళ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలి’ అని శ్రుతి చెప్పుకొచ్చారు.
అగ్ర హీరో కుమార్తెగా ఉండి కూడా కష్టాల్ని ఎదుర్కోవడం కాస్తా వింతగా ఉంది. కానీ ఇది నిజం. శ్రుతి ఎప్పుడూ సొంత వ్యక్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.