గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అకాల మరణం టాలీవుడ్ లో అందర్నీ ఎంతగానో కలచివేస్తోంది. ప్రముఖులంతా బాలుతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు నటుడు-నిర్మాత మోహన్ బాబు. తను కష్టాల్లో ఉన్న రోజుల్లో బాలు దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకున్న విషయాన్ని మోహన్ బాబు బయటపెట్టారు.
"నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే కాలంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాను. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం దగ్గరకు వెళ్లి వంద రూపాయలు అడిగి తీసుకున్నాను. మేం కలుసుకున్నప్పుడల్లా ఇప్పటికీ ఆ వంద రూపాయల విషయం ప్రస్తావించి, వడ్డీతో కలిపి ఇప్పుడది ఎంతవుతుందో తెలుసా! వడ్డీతో సహా నా డబ్బులు నాకు ఇచ్చేయ్ అని సరదాగా ఆటపట్టించేవారు."
ఇలా బాలుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మోహన్ బాబు. ఎస్పీబీని తను ఆప్యాయంగా బాలు అని పిలిస్తే.. ఆయన మాత్రం తనను భక్తా, వస్తా, శిశుపాలా అంటూ సరదాగా పిలిచేవారని అన్నారు.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా బయటపెట్టారు మోహన్ బాబు. ఇండస్ట్రీకి రాకముందే బాలు-మోహన్ బాబు ఫ్రెండ్స్ అంట. శ్రీకాళహస్తిలో కలిసి చదువుకున్నారట.