ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే హీరోలకు, పరాయి భాషల నుంచి అనువాదం అయ్యే తెలుగు సినిమాలకూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తనవంతు సహకారం అందించి, అందులోనూ తన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు ఎస్పీబీ. ఎస్పీబీ చేత మాటల విషయంలో కూడా గాత్రదానం పొందిన స్టార్ హీరోలు అనేక మంది ఉన్నారు. వారిలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారితో పాటు.. కొంతమంది తెలుగు హీరోలు కూడా ఉన్నారు.
ఆ మధ్య నటుడు నరేష్ ఈ విషయం గురించి ప్రస్తావించారు. తన తొలి సినిమా నాలుగు స్తంభాలటలో తన పాత్రకు ఎస్పీబీ చేత డబ్బింగ్ చెప్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చెన్నైలో చదువుకుని, అక్కడే పెరగడంతో తన తెలుగు సరిగా లేకపోవడంతో దర్శకుడు జంధ్యాల ఎస్పీబీతో డబ్బింగ్ చెప్పించారని నరేష్ చెప్పారు. డబ్బింగ్ పనంతా పూర్తయిన తర్వాత ఎస్పీబీ తనను పిలిచారని, 'చాలా బాగా చేశావు... తెలుగు కూడా బాగా నేర్చుకుని నువ్వే డబ్బింగ్ చెప్పవచ్చు కదయ్యా..' అంటూ ఆయనను తనను అభినందిస్తూనే, సుతరంగా మందలించారని నరేష్ వివరించాడు. ఆ తర్వాత తన తల్లి విజయనిర్మల ఈ విషయంపై దృష్టి పెట్టగా, దర్శకుడు జంధ్యాలే తనకు తెలుగు ఉచ్ఛరణను నేర్పించి ఆ తర్వాతి సినిమాల నుంచి తన చేతే డబ్బింగ్ చెప్పించారని నరేష్ ఒకసారి వివరించారు.
ఇక కమల్ హాసన్ కు అయితే ఎస్పీబీ వాయిస్ దాదాపు 99 శాతం వరకూ సరిపోలుతుంది. కొన్ని సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు కమల్, ఆయన బిజీగా ఉన్న సమయంలో ఎస్పీబీ డబ్బింగ్ చెప్పారు. అయితే కమల్ సినిమాల్లో వేటికి ఎస్పీబీ చెప్పారు, వేటికి కమల్ సొంతంగా చెప్పుకున్నారో చెప్పాలంటే కాసేపైనా ఆ సినిమాలను చూడాల్సిందే!
భామనే సత్యభామనే, దశావతారం సినిమాలో కొన్ని పాత్రలకు, తెనాలి, పంచతంత్రం.. వంటి సినిమాల్లో కమల్ కనిపిస్తే, బాలూ వినిపిస్తారు. పంచతంత్రం సినిమాలో ఒక పాటను కమల్ సొంతంగా పాడారు కానీ, డబ్బింగ్ మాత్రం ఎస్పీబీ చెప్పారు. ఒక దశలో తను డబ్బింగ్ లు చెప్పడం మానేస్తున్నట్టుగా చెప్పగా.. 'ఎలా అన్నయ్యా..' అంటూ కమల్ తనను దగ్గర మొరపెట్టుకుని మళ్లీ డబ్బింగ్ చెప్పించుకున్నాడని బాలూ తమ అనుబంధం గురించి వివరించారు.
రజనీకాంత్ కు సాయి కుమార్, మనోల డబ్బింగ్ బ్రహ్మాండంగా సెట్ కావడంతో బాలూకు అరుదుగా మాత్రమే ఆయనకు డబ్బింగ్ చెప్పారు. కథానాయకుడు సినిమాలో బాలూ డబ్బింగ్ చెప్పారు.