యనమలా? తరువాత ఏంటీ?

ఏ వంకా లేనమ్మ..డొంక పట్టుకుని గోల చేసింది అన్నది సామెత. అధికారానికి దూరమైన తెలుగుదేశం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి పని అలాగే వుంది. తనేదో మేధావిలా, గొప్ప పాయింట్ పట్టుకున్నట్లు తరచు ఏదో విమర్శ చేస్తుంటారు. కానీ అక్కడే సమస్య ఏమిటంటే, ఇంతకు ముందు తానేం అన్నారు అన్నది చాలా కన్వీనియెంట్ గా మరచిపోతుంటారు. 

కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆయన హైరానా ఇంతా అంతా కాదు. ముందు ఏమో, ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదు అన్నారు. సీరియస్ గా తీసుకుంటే కేసులు దాచేస్తున్నారు అన్నారు. కేసులు ఎక్కువ వస్తుంటే చావులు దాచేస్తున్నారు అంటున్నారు. అంటే అసలు బాధ ఏమిటంటే, ఆంధ్రలో జనం కరోనాతో అల్లల్లాడిపోవాలి. కేసలు పెరిగిపోయి, చావులుపెరిగిపోవాలి. అప్పుడు తెలుగుదేశం నేతలంతా పండగ చేసుకుని, అదిగో ఇదంతా జగన్ చేతకాని తనం అని టముకు వేసుకోవాలి.

అదే కదా? అంతే కదా? లాక్ డౌన్ ను ఎక్కడా ఏ సమస్య లేకుండా ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు. సరుకుల కొరత లేకుండా ఎలా చూస్తున్నారు. రేట్లు అదుపులో ఎలా వుంచుతున్నారు. చాలా రాష్ట్రాల మాదిరిగా కాకుండా నిత్యం వేలకు వేలు టెస్ట్ లు ఎలా చేస్తున్నారు. ఇలా ఇవన్నీ పట్టలేదు. వీటి మధ్యలో రంధ్రాన్వేషణ ఎలా చేయాలి? ఏం చేయాలి? అన్నదే బాధగా వుంది యనమల లాంటి వాళ్లకు

ఖాళీగా అటు అధికారం లేక, ఇటు బయటకు వెళ్లలేక వున్న ఈ మాజీ ల పని ఏమిటంటే, ఏం పాయింట్ తడుతుందా? ఓ బైట్ మీడియాకు వదులుదామా? అన్నదే. అంతే తప్ప, జనాలకు ఒక్క హితవు చెప్పిన పాపానపోయారా?

హెరిటేజ్ లో ఎంతమందికి కరోనా వచ్చింది?