వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నోరు తెరిస్తే మాటల ప్రవాహమే. ప్రత్యర్థులపై విమర్శలకు దిగితే ఏకే 47 నుంచి బుల్లెట్ దిగినట్టే. అంత వాడిగా, వేడిగా ఆమె విమర్శలుంటాయి. తన మాటల ఉధృతితో ఎదుటి వారిని ఊపిరి తీసుకోనివ్వకుండా మాట్లాడ్డం రోజా ప్రత్యేకత. వైసీపీలో రోజా అత్యంత కీలక నాయకురాలు. ఆ పార్టీలో వైఎస్ జగన్ తర్వాత టీడీపీ, ఎల్లో మీడియా టార్గెట్ రోజానే. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోమవారం NTVలో జరిగిన లైవ్ షోలో చెప్పుకొచ్చారు.
ఆ చానల్లో రోజా ఇంటర్వ్యూ ఆద్యంతం ఆసక్తికరంగా, వాడి, వేడిగా సాగింది. తాను వంట చేసే వీడియో యూట్యూబ్లో పెడితే 15 లక్షల మంది చూస్తారంటూ తన ఫాలోయింగ్ ఏంటో రోజా చెప్పకనే చెప్పారు. రోజాలోని వాదనా పటిమ ఎంత గట్టిదో ఈ ఇంటర్వ్యూ నిరూపించింది. ఇంతకూ రోజా ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే...
"పెద్ద వెయ్యి రూపాయలు ఇచ్చి ఏదో చెబుతున్నారంటే...నీ (బాబు) ముఖానికి ఏమిచ్చావ్. హుదూద్ తుపాన్ వచ్చినప్పుడు బాధితులకు ఏమిచ్చావ్. కోట్ల రూపాయలు దండుకున్నావ్. ఆయన ముఖానికి వెళ్లి చూడండి. ఎక్కడెక్కడ హుదూద్ వచ్చింది...ఎక్కడెక్కడ తిత్లీ వచ్చింది. ఎక్కడైనా ఒక ఇల్లు కట్టించాడా? డ్రైనేజీ కట్టించాడా? పోయి చూడండి(యాంకర్కు సూచన). అన్నీ ఓపెన్ సీక్రెట్. ఇవ్వన్నీ మేము దాచేటి కాదు. మీరు దాచి పెట్టేది లేదు.
ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నాను. ఇదే అమరావతిలో తన సామాజిక వర్గానికో, తన పార్టీ వాళ్లకో నష్టం వస్తుందంటే...జోలె పట్టుకుని అడక్క తిన్నాడు కదా..ఈ రోజు ఎందుకు అడక్కతినలేదు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల దగ్గర జోలె పట్టుకుని అడుక్కుని సీఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వొచ్చు కదా? ఎందుకు ఇవ్వలేదు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి రూ.10 లక్షలా ఇచ్చేది. సిగ్గు చేటు.
వీరి భార్యకు మాత్రం తన సామాజిక వర్గం వాళ్ల ఉద్యమానికి రెండు బంగారు గాజులు ఇవ్వడం తెలుసు? మరి కరోనా బాధితులకు నాలుగు బంగారు గాజులు ఇవ్వొచ్చు కదా? మరి ఎందుకు ఇవ్వలేదని అడగండి? మీరు (యాంకర్ను ఉద్దేశించి) వాళ్లని అడగరు. వాళ్లు అన్నవన్నీ ఎత్తుకొచ్చి మమ్మల్ని అడుగుతారు. (యాంకర్ జోక్యం చేసుకుని గతంలో వాళ్లని ప్రశ్నించామని చెప్పాడు) గతంలో కూడా ప్రభుత్వాన్ని అడగలేదనే కదా మా బాధ.
అప్పుడు కూడా మీరు ప్రభుత్వాన్ని అడగలేదు. అప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశారు. ఏ రోజు అడగారో చెప్పండి. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే, సీసీ కెమెరా ఫుటేజ్ని కాల్చేస్తే ఇంత వరకు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. (ఇప్పుడు కరోనా విషయానికి వద్దాం అని యాంకర్ రుషి అన్నాడు) ఆఆ..మా దగ్గరికొస్తే కరోనా వస్తుంది. అదే వాళ్ల దగ్గరికి వెళితే అన్నీ పక్కకి పోతాయ్. (టీడీపీ మిమ్మల్ని టార్గెట్ చేస్తే....మీరు నన్ను టార్గెట్ చేశారా అని యాంకర్ ప్రశ్న). నిన్ను కాదు...చెత్త క్వశ్చన్ అడిగితే కోపం వస్తుంది.
దేశంలో 10 లక్షల మందిని యావరేజ్గా తీసుకుంటే 430ని మాత్రమే పరీక్షిస్తున్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1330 మందిని చేస్తున్నారు. తెలంగాణలో కరోనా బాధితులు 1010, ఆంధ్రాలో 1100 మంది చిల్లర. ఏపీ సీఎం జగన్ చిత్తశుద్ధిని చూడటం లేదు. టీడీపీ కేడర్ అంతా రమ్మనండి...పరీక్షలు చేస్తాం. గొల్లపూడి రెడ్జోన్లో వాళ్లు మాత్రం తిరిగి కూరగాయలు పంపిణీ చేయొచ్చు. నేను మాత్రం నా నియోజకవర్గంలో పంచకూడడా?
నాకు ఓటు వేసిన ప్రజలకి అండగా ఉన్న విషయం వాళ్లకి తెలిస్తే చాలు. నాకు టీవీల్లో పబ్లిసిటీ అవసరం లేదు. నా నియోజకవర్గ ఓటరు దగ్గర నాకు చెడ్డపేరు రావద్దు. ఈ అమ్మకు ఓటు వేశాం...నాకు కష్టం వచ్చినప్పుడు కనిపించలేదు. నాకు సపోర్ట్ చేయలేదు అని నా ఓటరు నుంచి కంప్లైంట్ రాకూడదు. నన్ను నమ్మి సీటు ఇచ్చిన జగన్మోహన్రెడ్డి నుంచి ఆ మాట రాకూడదు. మా నాయకుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఆయన స్ఫూర్తితో మేము పనిచేస్తున్నాం.
గుజరాత్, తెలంగాణలలో పోలీసుల మీద పూలు చల్లితో ఆహో, ఓహో అంటారు. అదే ఏపీలో ఒక ఎమ్మెల్యేపై పూలుజల్లితే తప్పు పడుతున్నారు. నాకు పబ్లిసిటీ అవసరం లేదు. ఎందుకంటే నేను వంట చేసే వీడియో యూట్యూబ్లో పెడితే 15 లక్షల మంది చూస్తారు. మినిమమ్ కామన్సెన్స్ లేనివాళ్లు టీడీపీ, జనసేన వాళ్లు. జగన్లాగే నన్ను కంటిన్యూగా టార్గెట్ చేస్తున్నారు" అని రోజా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరిగా నాలుగు ప్రశ్నలు టీడీపీ వాళ్లకు వేయాలని తన మాటగా చెబుతూ ముగించారు. ప్రస్తుతం ఈ వీడీయో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
-సొదుం
అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ