ఆంధ్ర‌జ్యోతి ఆర్‌కే ను హ‌ర్ట్ చేసిన జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీలో గురువారం వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ హ‌ర్ట్ అయ్యాడు. అసెంబ్లీ స‌మావేశాల్లో క‌నీసం మాట మాత్రంగానైనా ఆంధ్ర‌జ్యోతిని టీడీపీ క‌ర‌ప‌త్రం అనక‌పోవ‌డంతో ఆర్‌కే తీవ్ర నిర్వేదానికి గుర‌య్యార‌ని స‌మాచారం. నిన్న‌టి స‌భ‌లో జ‌గ‌న్ ప‌లు సంద‌ర్భాల్లో ఏం మాట్లాడారో గుర్తు చేసుకొందాం.

"ఈనాడులో రాసింది మేం ఇక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది? బుద్ధి ఉందా? పేపర్‌ అనేది బేసిక్‌గా అదొక మీడియా వ్యవస్థ. వారికి ఈనాడు ఉంటుంది. సాక్షి అనే పేపర్‌ ఈనాడుకు ఆపోజిట్‌గా ఒక వ్యవస్థగా ఉంటుంది.  ఈనాడు పత్రిక నేటికీ చంద్రబాబును మోస్తోంది" అని జగన్ విమ‌ర్శించారు.

ఇంత‌కంటే ఆర్‌కేకు అవ‌మానం ఏముంటుంది. సాక్షి పేప‌ర్ కేవ‌లం ఈనాడుకు మాత్ర‌మే వ్య‌తిరేకంగా పుట్టిందా? మ‌రి జ‌గ‌న్ దృష్టిలో ఆంధ్ర‌జ్యోతి అంటే ఒక ప‌త్రికే కాదా? ఎంత అహంకారం? మ‌రో విష‌యం గురించి మాట్లాడుకోవాలి. ఈనాడు ప‌త్రిక నేటికీ చంద్ర‌బాబును మోస్తోందా...ఇంత‌కంటే అన్యాయ‌మైన‌, దుర్మార్గ‌మైన మాట‌లేమైనా ఉన్నాయా. 24 గంట‌లూ ఇటు ప‌త్రిక‌లోనూ, అటు ఏబీఎన్ చాన‌ల్‌లోనూ చంద్ర‌బాబును మోస్తుంటే...జ‌గ‌న్ మాత్రం ఈనాడు మోస్తోంద‌ని అంటాడేంటి?

 "ముసుగులు వేసుకొని తనకు ఏ పేపర్‌లు లేవని చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు.  ఇంగ్లీషు మీడియం నిర్ణయంపై ఈనాడు, చంద్రబాబు, ఒక సామాజిక వర్గం యుద్ధం ప్రకటించింది. దీనికి వెంకయ్యనాయుడు వత్తాసు పలుకుతూ ప్రాంతీయ భాషల్లోనే విద్యాబోధన ఉండాలన్నారని ఈనాడు రాసింది" అని సీఎం పేర్కొన్నా రు.

వెంక‌య్య‌నాయుడి వ్యాస‌మే క‌నిపించిందా? మ‌రి ఏపీలో  "ర‌హ‌స్య " ఎజెండా పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆంగ్ల‌మాధ్య‌మం ప్ర‌వేశ పెట్ట‌డం వెనుక జ‌గ‌న్ స‌ర్కార్ క్రిస్టియ‌న్ మ‌త‌మార్పిళ్లు చేయాల‌నే ఎత్తుగ‌డ ఉంద‌ని కొత్త‌ప‌లుకులో రాసిన ఏకైక వ్య‌క్తి రాధాకృష్ణ‌నే క‌దా. ఇలా ప్ర‌తి వారం ఉన్న‌వి లేనివి క‌ల్పించి కొత్త‌ప‌లుకు శీర్షిక కింద జ‌గ‌న్‌ను తిట్ట‌ని తిట్టు తిట్ట‌కుండా రాసే , కూసే ప‌లుకుల‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీరు కింద అయ్యిన‌ట్టేనా?

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నాలుగు రోజుల ముందు విజ్ఞ‌త‌తో ఓటేయండి...ఏపీని గెలిపించండి అంటూ గ‌తంలో ఏ ప‌త్రికా, ఏ ప‌త్రికాధిప‌తి సాహ‌సించ‌ని విధంగా ఏకంగా జ‌గ‌న్‌ను ఓడించాల‌ని ఎడిటోరియ‌ల్ రాస్తే...క‌నీసం తిట్టించుకోడానికి కూడా అర్హ‌త లేనంత అథ‌మ‌స్థాయిలో ఆంధ్ర‌జ్యోతి, రాధాకృష్ణ ఉన్నారా జ‌గ‌న్‌?

 ఈనాడును చంద్ర‌బాబు క‌ర‌ప‌త్రంగా చెబుతున్నావే...మ‌రి ఏబీఎన్‌పై నిషేధం ఎందుకు విధించావో చెప్పి తీరాల్సిందే. అంతేకాదు చంద్ర‌బాబు క‌ర‌ప‌త్రానికి యాడ్స్ ఇస్తాన‌ని నిండు స‌భ‌లో ప్ర‌క‌టించావే, మ‌రి ఏం పాపం చేసింద‌ని ఆంధ్ర‌జ్యోతికి క‌నీసం ఒక్క రూపాయి యాడ్ ఇవ్వ‌డం లేదో రాధాకృష్ణ‌కు స‌మాధానం చెప్పాలి సీఎం గారూ!

ప్ర‌తిరోజూ గుడ్డ‌లు చించుకుని చంద్ర‌బాబుకు ఒత్తాసు ప‌లుకుతుండే ఆంధ్ర‌జ్యోతిని కాద‌ని ఈనాడును క‌ర‌ప‌త్ర‌మ‌ని పేర్కొన్న మీరు రాధాకృష్ణ‌ను హ‌ర్ట్ చేశారనే విష‌యాన్ని గుర్తించారా? ఈనాడును క‌ర‌ప‌త్ర‌మ‌ని ప్ర‌శంసిస్తుంటే, నిజంగా క‌ర‌ప‌త్ర‌మైన ఆంధ్ర‌జ్యోతికి యాడ్స్ ఇవ్వ‌కుండా వాత‌లు పెట్ట‌డం న్యాయ‌మా? అంతే లేండి సార్‌, గాయ‌ప‌డిన మ‌న‌సుకు తెలుసు బాధేందో.

Show comments